
శ్రీరాముడి జన్మ స్థానమైన అయోధ్యలో రామ మందిరం నిర్మాణాన్ని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ శ్రీరామ్ జన్మభూమి మందిర్ నిర్మాణానికి విరాళాల సేకరణ కూడా జరుగుతోంది. కోట్లాది మంది రామ భక్తులు ఎలా అయితే రామ జన్మభూమి కోసం పోరాటం చేశారో.. అలాగే రాముడి మందిరం నిర్మించడానికి కూడా సాయం చేయాలని ట్రస్ట్ ఇప్పటికే కోరింది. ఈ మందిరం నిర్మాణంలో సామాన్య ప్రజలను కూడా భాగం చేసేందుకు ఈ విరాళాల సేకరణను దేశ వ్యాప్తంగా మొదలుపెట్టింది. అయితే, రామ మందిరం నిర్మాణానికి తన వంతు సాయంగా రూ.30 లక్షలు విరాళంగా ప్రకటించారు జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం తిరుపతి పర్యటనలో ఉన్న ఈ మేరకు విరాళాన్ని ప్రకటించారు. తిరుపతిలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. మీడియా సమక్షంలోనే చెక్కును శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్కు అందజేశారు. ‘‘ధర్మానికి ప్రతిరూపమే శ్రీరామచంద్రుడు. ఆయన చూపించిన సహనం, శాంతి, త్యాగం, శౌర్యం ప్రజలకు ఆదర్శం. ఈ దేశం ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, ఎన్ని దాడులు ఎదుర్కొన్నా బలంగా నిలబడగలిగింది అంటే శ్రీరామచంద్రుడు ఏర్పరిచిన దారి వల్లే. పరమత సహనాన్ని పాటిస్తూ.. అన్ని మతాలను స్వీకరిస్తూ ఈరోజు భారతదేశం ఇంత దృఢంగా ఉందంటే దానికి కారణం రామచంద్రుడు ఏర్పరిచిన దారే. అందుకే మనది రామరాజ్యం అంటాం. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్యలో రామాలయం కడుతుంటే ప్రతి ఒక్క భారతీయుడు విరాళం ఇచ్చి సహకరించాలి. నేను కూడా నా వంతు కృషిగా రూ.30 లక్షలు రామాలయం నిర్మాణానికి ఇస్తున్నాను. నేను విరాళం ఇస్తున్నానని తెలియగానే ఆశ్చర్యకరంగా నా కార్యవర్గం కూడా రూ.11 వేల విరాళాన్ని ఇచ్చారు. వీళ్లలో ముస్లింలు, క్రైస్తవులు.. ఇలా అన్ని మతాలు, కులాల వాళ్లు ఉన్నారు. వాళ్లంతా ఏకమై రూ.11 వేల విరాళం నా చేతులతో అందజేయమని ఇచ్చారు. దాన్ని కూడా డీడీ తీసి అందజేస్తున్నాను’’ అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అనంతరం చెక్కులను రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్. నాయకుడు భరత్ జీకి అందజేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39Yb1f8
No comments:
Post a Comment
If you have any doubts, please let us know.